రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మహమ్మారి తన పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రంలో స్వైన్ఫ్లూ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది.
స్వైన్ఫ్లూ మహమ్మారి రాష్ట్ర రాజధానిలో మాత్రమే పరిమితమై ఉందని భావిస్తే తప్పులో కాలేసినట్లేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి పొరుగు జిల్లాలకు కూడా పాకుతోంది. గురువారం ఉదయం హైదరాబాదులోని కామినేని ఆస్పత్రిలో చేతన్ అనే యువకుడు స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందాడు. ఇతను ఖాసి వరంగల్కు చెందినవాడని వైద్యాధికారులు తెలిపారు.
తాజాగా నిమ్స్లోని ముగ్గురు వైద్యులకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. కాగా బుధవారం నల్లగొండ జిల్లా ఆత్మకూరు (ఎం) గ్రామానికి చెందిన బొడిగ ఎల్లమ్మ అనే మహిళ స్వైన్ఫ్లూతో మరణించింది. నల్లగొండ జిల్లా కలెక్టర్ రిజ్వీకి కూడా స్వైన్ ఫ్లూ సోకింది. ఈ వ్యాధికి ఆయన చికిత్స చేయించుకుంటున్నారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఇటీవల ఒక చిన్న పిల్లల వైద్యనిపుణుడు మృతి చెందాడు. అతను స్వైన్ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు పలువురు అనుమానిస్తున్నారు.
దీంతో బుధవారంనాడు హైదరాబాద్లో స్వైన్ప్లూ వ్యాధికి సంబంధించి పరీక్షల నిమిత్తం దాదాపు 770 మంది ఆస్పత్రులకు వచ్చి పరీక్ష చేయించుకున్నట్లు ప్రాథమిక సమాచారం. వీరిలో 50 మంది నుంచి నమూనాలను సేకరించారు. మిగిలిన 22 మందికి స్వైన్ఫ్లూ లక్షణాలున్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.