#TelanganaElections2023 : ఓటు హక్కును వినియోగించుకున్న సినీ సెలెబ్రిటీలు

గురువారం, 30 నవంబరు 2023 (11:11 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి ప్రశాతంగా సాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో అనేక మంది సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అనేక మంది సినీ ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో పాటు ఎన్టీఆర్ తల్లి షాలిని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లు ఉన్నారు. 
 
చిరంజీవి తన భార్య సురేఖతో పాటు కుమార్తె శ్రీజతో కలిసి వచ్చారు. వీరంతా వరుసలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే, ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎస్సార్ నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 188లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అలాగే, హీరో శ్రీకాంత్ దంపతులు, కుమారుడు, హీరో నాగార్జున, అమల దంపతులు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, కళ్యాణ్ రామ్, రాజా రవీంద్ర, ఎంఎం కీరవాణి, దర్శకుడు కె.సుకుమార్ దంపతులు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు, దర్శకుడు రాజమౌళి దంపతులు ఇలా అనేక మంది సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు