తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మరికొన్ని గంటల్లో ప్రచారం పరిసమాప్తం

మంగళవారం, 28 నవంబరు 2023 (09:39 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కానుంది. దాదాపు గత నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ఈ ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. 
 
భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
 
ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
టీవీలు, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ (మోడల్ కోడ్ మీడియా కమిటీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే సంసిద్ధమయ్యారు.
 
మరోవైపు, భారత రాష్ట్ర సమితి పార్టీకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ నోటీసులు జారీ చేశారు. స్కాంగ్రేస్ అంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై  ఈ నోటీసులను ఎన్నికల సంఘం జారీచేసింది. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఈవో వికాస్ రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు