హైదరాబాద్ శివారు బేగరికంచలో క్రికెట్ స్టేడియం.. రేవంత్ రెడ్డి ప్రకటన

సెల్వి

శుక్రవారం, 2 ఆగస్టు 2024 (20:10 IST)
Revanth Reddy
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. గురువారం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన హైదరాబాద్‌ శివార్లలోని బేగరికంచలో స్టేడియం రానున్నట్లు రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు.
 
ప్రతిపాదిత క్రికెట్ స్టేడియంకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ప్రాథమిక చర్చలు జరిగాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీని ప్రకటిస్తామని.. హర్యానా క్రీడా విధానాన్ని రాష్ట్ర సర్కారు పరిశీలిస్తుందన్నారు. 
 
2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకు రూ.321 కోట్లు కేటాయించినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త క్రీడా విధానాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆవిష్కరిస్తామని, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలని కోరారు.
 
కొత్త క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్ స్టేడియంలలో క్రీడా కార్యకలాపాలు తగ్గిపోయాయని సూచించారు. ఎల్బీ స్టేడియంలో ఇదే జరిగిందని, రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువగా వాడుకుంటున్నారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు