మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరందాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా తెలంగాణాలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వరద ముప్పుపొంచివున్న జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయి.
అదేసమయంలో వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయంతెల్సిందే.