పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. ఫేస్‌‌‌‌‌బుక్ పరిచయం కొంపముంచింది

సెల్వి

సోమవారం, 16 జూన్ 2025 (10:23 IST)
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అక్కడితో ఆగకుండా ఆ మహిళ నుంచి లక్షల్లో నగదుతో పారిపోయిన ఘటన తెలంగాణలోని బేగంపేటలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బేగంపేటలోని రసూల్‌పురాకు చెందిన 47 ఏళ్ల ఓ మహిళకు ముంబైకి చెందిన 42 ఏళ్ల కల్పేష్ శశికాంత్ కక్కడ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. 
 
ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపించాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆ మహిళ అతడి రిక్వెస్ట్‌ను యాక్సప్ట్ చేసింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2023 జనవరిలో కల్పేష్ ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. 
 
బేగం పేటలోని ఓ హోటల్‌లో బస చేశాడు. అనంతరం ఆ మహిళను ఆ హోటల్‌కు రప్పించి మాట్లాడాడు. తనకు చాలా ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని బాగా నమ్మించాడు. ఆ తర్వాత ఆమెను తన మాయలోకి దింపి అత్యాచారం చేశాడు. సంపాదన కోసం పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు కావాలని ఆమె వద్ద లక్షల్లో కాజేశాడు. 
 
ఆపై ముంబైకి పారిపోయాడు. అనంతరం ఆ మహిళ ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావ్, డబ్బులు విషయం ఏమైంది అని అడగ్గా.. ఆమెను బెదిరించాడు. ఆమెతో కలిసి న్యూడ్‌గా దిగిన ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని బయపెట్టాడు. 
 
దీంతో ఆ మహిళ ఏం చేయాలో తెలియక శనివారం బేగంపేట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిపై అత్యాచారం, మోసం కింద కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు