ఒకపుడు మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, ఈ జీవితం తనకు పునర్జన్మ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. తన భర్త, కుంజ రాము 21వ వర్థంతి సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. భర్త స్మృతులను తలచుకుని చలించిపోయారు. కన్నీటిపర్యంతమయ్యారు. తన జీవితంలోని కష్టాలను, ప్రజలకు సేవ చేయాలనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నారు.
ఒకపుడు ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నానని, అది తనకు పునర్జన్మ అని మంత్రి సీతక్క అన్నారు. ఈ జన్మలో పేదలు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడుతానని ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు.
పాలమూరు జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లిలో జరిగిన తన భర్త వర్థంతి సభలో మంత్రి సీతక్క తన కుమారుడు సూర్య, కోడలు కుసుమాంజలితో కలిసి పాల్గొన్నారు. రాము 17 యేళ్ల వయసులోనే ఉద్యమంలో చేరి ఎన్నో పోరాటాలలో పాలుపంచుకున్నారని, ఆయన ఎల్లపుడూ అట్టడుగు వర్గాల అభివృద్ధికి పాటుపడ్డారని ఆమె గుర్తు చేసుకున్నారు. రాము నేర్పిన విలువలు, నైతికతతో తాను ప్రజల కోసం పని చేస్తున్నానని సీతక్క గుర్తుచేశారు.