ఇటీవల బ్యాంకాక్లో సంభవించిన భూకంపంలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్కుమార్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. ఈ భూప్రకంపనల నుంచి ఎమ్మెల్యే భార్య మనాలి, కుమార్తె మానస, కుమారులు ప్రతీక్, నిధిశ్లు శనివారం మధ్యాహ్నం క్షేమంగా స్వస్థలానికి చేరుకున్నారు. వీరంతా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని క్షేమంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తన కుటుంబ సభ్యులను చూడగానే ఎమ్మెల్యే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ మాట్లాడుతూ, బంధువుల పెళ్లి కోసం వారు బ్యాంకాక్ వెళ్లారు. ఊహించని పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు అనేది భగవంతుడి దయ వల్లే జరిగింది అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అలాగే, ఎమ్మెల్యే భార్య మనాలి మాట్లాడుతూ, బంధువుల వివాహం వేడుక కోసం బ్యాంకాక్ వెళ్లిన మేము నోవాటెల్ హోటల్లోని 35వ అంతస్తులోని ఓ గదిలో బస చేశాం. శుక్రవారం ఉదయం భూప్రకంపనలు ప్రారంభమకావడంతో ముగ్గురు పిల్లలను తీసుకుని మెట్ల మార్గంలో వేగంగా బయటకు వచ్చాం. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోవడం, భవనం ఓ పక్కకు ఒరిగిపోవడంతో తామంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బయటకు వచ్చి చూసేసరికి కళ్లముందే భవనాలు పేకమేడల్లా కూలిపోవడం చూసి చాలా భయమేసింది అని చెప్పుకొచ్చారు. తాము సురక్షితంగా స్వదేశానికి వచ్చామంటే అదంతా ఆ భగవంతుడి దయ మాత్రమే అని పేర్కొన్నారు.