బాలాపూర్ లడ్డు వేలం పాటల్లో సరికొత్త నిబంధన.. ఏంటది?

ఠాగూర్

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (09:14 IST)
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డు వేలం పాటలు మంగళవారం జరుగనున్నాయి. అయితే, ఈ వేలం పాటల్లో తొలిసారి ఓ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. వేలం పాటల్లో పాల్గొనేవారు ముందుకు కొంత డబ్బును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు వెల్లడించారు. 
 
ప్రతి యేటా బాలాపూర్ వినాయకుడి లడ్డూకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెల్సిందే. ఈ గణేశుడి లడ్డూ ప్రసాదం లక్షలు పలుకుతూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. బాలాపూర్ లడ్డూ వేలం 1994 నుంచి కొనసాగుతోంది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం రూ.450 పలికిన లడ్డూ 2023లో రూ.27 లక్షలు పలికింది.
 
దాదాపు రెండు దశాబ్దాలుగా లక్షలు పలుకుతోంది. అయితే బాలాపూర్ లడ్డూకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్వాహకులు కొత్త నిబంధనను తీసుకువచ్చారు. లడ్డూ వేలంలో పాల్గొనే పోటీదారులు ముందస్తుగా డబ్బును డిపాజిట్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. బాలాపూర్ లడ్డూ వేలం మంగళవారం ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభంకానుంది.
 
మరోవైవు, హైదరాబాద్ ఖైరతాబాద్ మహా గణపతి హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. హోర్డింగ్లు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆలయాన్ని తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు