ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

ఠాగూర్

గురువారం, 12 జూన్ 2025 (19:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. ఈ పిడుగుపాటు కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు పిడుగుపాటుకు గురికావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
పిడుగుపాటుకు చనిపోయినవారిలో పెందూర్ మాదర్రావు (45), సంజన (22), మంగం భీంబాయి (40), సిడాం రాంబాయి (45)లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వెంటనే సమీపంలోని ఝురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
అలాగే, సాంగిడి గ్రామంలో పొలం పనుల్లో ఉన్న నందిని (30), పత్తివిత్తనాలు వేస్తున్న సునీత (35)లు పిడుగుపాటుకు గురయ్యారు. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
 
అదేవిధంగా ఉట్నూర్ మండలం, కుమ్మరితాండాలోనూ పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన బోకన్ ధన్‌రాజ్ (27), నిర్మల (36), కృష్ణబాయి (30)లు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక ఆలయ గోపురం పైభాగం కూడా స్వల్పంగా ధ్వంసమైంది. అకాల వర్షాలు, పిడుగుపాట్ల ఘటనలతో జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు