సీఎం రేవంత్ రెడ్డి చొరవతో... కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం...

ఠాగూర్

మంగళవారం, 9 జనవరి 2024 (17:48 IST)
ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరించింది. దీంతో ఆ మహిళా కానిస్టేబుల్ సతీమణి ప్రజావాణి కార్యక్రంలో తన గోడును వినిపించుకుంది. దీన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దకృక్పథంతో ఉద్యోగం కల్పించాలని ఆదేశించారు. 
 
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది. 
 
ఈ నేపథ్యంలో బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని తెలపగా, సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డి‌జి‌పి... రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వవలసినదిగా రాచకొండ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాచకొండ సీపీ... రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్‌ను మంగళవారం ఇచ్చారు. ఆ మహిళ కోసం ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు. 
 
అలాగే, కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీకి, రాచకొండ పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు