రేవంత్ రెడ్డి రెండేళ్ల ముఖ్యమంత్రేనా? తెలంగాణాలో జరుగా ప్రచారం.. సీఎం ఎమన్నారు...?

ఠాగూర్

ఆదివారం, 7 జనవరి 2024 (09:31 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన రేవంత్.. గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం చేసింది. అయితే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్ల పాటు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత మరో సీనియర్ నేత ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 
 
తాను రెండేళ్లు లేదా మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందు తానే ముఖ్యమంత్రినంటూ చాలామంది చెప్పుకున్నారని.. కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అయిందన్నారు. తాను కేవలం టీమ్ లీడర్‌ను మాత్రమేనని... తన మంత్రివర్గంలో మంత్రులంతా చాలా సీనియర్లు అని.. వారి సలహాలు.. సూచనలతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
 
తాను కేంద్ర మంత్రులను కలిసినా ఆ శాఖకు సంబంధించిన మంత్రితో కలిసి వెళ్తున్నానని గుర్తు చేశారు. వన్ మ్యాన్ షో చేయదలుచుకోలేదన్నారు. నేనే బ్యాటింగ్... నేనే ఫీల్డింగ్... నేనే బౌలింగ్ చేయలేనన్నారు. అందరితో కలిసి ముందుకు సాగుతానన్నారు. ప్రచారం జరిగినట్లు తాను రెండేళ్లు సీఎంగా ఉన్నా.. మూడేళ్లు ఉన్నా ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. అంతకంటే సంతోషం ఏముంటుంది? అని ప్రశ్నించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పుడు సీఎం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్లే అన్నారు.
 
ఇకపోతే, "నువ్వు ఖచ్చితంగా మంచి పొజిషన్‌కు వెళతావు.. కానీ కాస్త దూకుడు తగ్గించు" అని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గతంలో తనకు సూచించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలో తాను మంచి స్థానానికి వెళతానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఈఎస్ఎల్ నరసింహన్ తన వద్దకు వచ్చారని... ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్టు చెప్పారు. మాజీ గవర్నర్ నరసింహన్‌తో పాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆశీర్వాదం కూడా తీసుకున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
 
అలాగే, ఎన్నికల సమయంలో సహకరించిన ఎంతోమంది నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని... వారందరికీ న్యాయం చేస్తామన్నారు. కోదండరాంకు త్వరలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సహకరించినందుకు వారి పార్టీకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. అలాగే తమ పార్టీలోని సీనియర్ నాయకులకు, పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వాల్సి ఉందన్నారు.
 
కాంగ్రెస్ పార్టీ తనకు ఇవ్వాల్సినదంతా ఇచ్చేసిందని... ఇక తానే పార్టీకి బాకీ ఉన్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ మోడల్ అని మా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేలా పని చేస్తానన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చారు. ఏవైనా పొరపాట్లు జరిగితే... ఎలాంటి భేషజాలకు పోకుండా సరిచేసుకునే ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు