కేసీఆర్ - హరీష్ రావు పాపాలు పండుతున్నాయ్ : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్

సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (08:54 IST)
గత పదేళ్లకాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు, కుమారుడు కేటీఆర్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు కలిసి తెలంగాణ రాష్ట్ర హక్కులను కేంద్రానికి తాకట్టుపెట్టారని, ఈ కారణంగానే కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన వివరించారు. తన కేబినెట్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... 
 
కేసీఆర్, హరీష్, డ్రామారావు(కేటీఆర్) వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి కాంగ్రెస్ పార్టీపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారు. ఈ పుస్తకానికి, ఈ చట్టానికి మీరే రచయిత. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందే కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు. అప్పటి తెరాస అభ్యంతరం చెప్పకపోగా కేసీఆర్ ఓటు వేసి చట్టాన్ని ఆమోదింపజేశారు. దీనికి బాధ్యులు కేసీఆర్, కె. కేశవరావు. వీరిద్దరూ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 
 
ఈ చట్టం కావడానికి మొట్టమొదటి కారణం కేసీఆరే. 811 టీఎంసీల నీళ్లపై పంపకాలు ఎలా జరగాలో ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. 2015 జూన్ 18న కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించింది. 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీష్ సంతకాలు పెట్టారు. తెలంగాణకు 50 శాతం వాటా అడగకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు. కృష్ణా నది 68 శాతం తెలంగాణలో ఉంది.. 32 శాతం మాత్రమే ఏపీలో ఉంది. అంతర్జాతీయ నీటి విధి విధానాల ప్రకారం 5వందల పైచిలుకు తెలంగాణకు, మిగతావి ఏపీకి కేటాయించాలి. కానీ సంతకాలు పెట్టి మరీ తెలంగాణకు రావాల్సిన నీటిని శాశ్వతంగా ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని 2022లో సమావేశంలో అంగీకరించారు.
 
19.05.2023న 17వ కేఆర్ఎంబీ సమావేశంలో కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ అంగీకరించారు. 2023 బడ్జెట్‌లో గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రూ.400 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయడం మామా, అల్లుళ్లు కలిసే చేశారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామి. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినపుడు హరీష్, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉన్నారు. పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా? పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకపోతుంటే కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి. వాళ్లకు సహకరించకుండా వైఎస్‌కు లొంగిపోయింది కేసీఆర్. 14 జనవరి 2020న జగన్ ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృష్ణా జలాలపై 6 గంటలు సమీక్ష చేశారు. అక్కడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
తండ్రి పోతిరెడ్డిపాడుతో రోజుకు 4 టీఎంసీలు తరలించుకుపోతే.. కొడుకు రాయలసీమ లిఫ్ట్‌తో రోజుకు 8 టీఎంసీలు తరలించుకుపోయారు. నీటి తరలింపుకు టెండర్ ఆపేందుకు సమావేశానికి వెళ్లకుండా సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖ రాయించారు. టెండర్ ఒప్పందాలు పూర్తి కావాలనే కేసీఆర్ ఆ సమావేశానికి వెళ్లలేదు. కేసీఆర్ ధనదాహంతో తెలంగాణ నీటిని తరలించుకుపోయేందుకు సహకరించారు. తెలంగాణ హక్కులను కాలరాస్తూ నీటి దొంగలు కృష్ణా జలాలను దారిదోపిడీ చేస్తున్నారు. ఈ జల దోపిడీకి కారణం కేసీఆర్. పదేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినదానికంటే ఎక్కువ ఈ నిర్లక్ష్యం పదేళ్లలో జరిగింది.
 
పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి పడావు పడ్డది. రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్... పదేళ్లయినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేస్తామని బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. పాపాలు చేసి ప్రజా ఉద్యమాలంటే ప్రజలు చెప్పుతో కొడతారు. తెలంగాణకు రావాల్సిన వాటా, హక్కుల కోసం మేం కొట్లాడుతుంటే. అధికారం కోల్పోయి దిక్కుతోచక ఏదో ఒక వంకతో మామా అల్లుళ్లు కాంగ్రెస్ ను బదనాం చేయాలని చూస్తున్నారు. 
 
కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం. రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం. రెండు రోజులు చాలవంటే సమావేశాలను పొడగిద్దాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి. నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా. మీకు పూర్తి అవకాశం ఇస్తాం... ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా. నిజానిజాలేంటో నిరూపిద్దాం రా. ఎవరు ద్రోహి, ఎవరు తెలంగాణకు అన్యాయం చేశారో తేలిపోతుంది అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు