చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తించిన విద్యార్థులు.. ఏమైంది?

సెల్వి

బుధవారం, 10 జనవరి 2024 (12:06 IST)
పిల్లలకు చాక్లెట్స్ అదే పనిగా కొనిపెడుతున్నారా.. అయితే మీకే ఈ స్టోరీ. స్కూల్ వద్ద దొరికే చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద.. పాన్ డబ్బాలో విక్రయించిన చాక్లెట్లు తిని విద్యార్ధులు వింత వింతగా ప్రవర్తించారు. 
 
పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌కి ఆనుకుని ఉన్న ఒరిస్సాకు చెందిన కొందరు వ్యక్తులు విద్యార్ధులకు పాన్ డబ్బాల్లో విక్రయించే చాక్లెట్లను ఉచితంగా ఇస్తూ వచ్చారు. 
 
ఆ చాక్లెట్లు తిన్న విద్యార్ధులు క్లాసులోకి రాగానే మత్తులోకి జారుకుని వింతగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు.. విషయాన్ని ఆరా తీయగా.. పాన్ డబ్బా వాసులు ఇచ్చిన చాక్లెట్లు తినడం వల్లే ఇదంతా జరుగుతోందని తేలింది. 
 
తొలుత ఉచితంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చిన పాన్‌డబ్బా వాసులు.. వాటికి క్రమంగా వారు బానిసులైన తర్వాత.. ఇప్పుడు రూ. 20కి ఒక్కో చాక్లెట్ అమ్ముతున్నట్టు గుర్తించారు. దీంతో పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఒరిస్సా నుంచి గాంజాతో చాక్లెట్స్‌ను తయారు చేసి కొత్తూరు గ్రామంలోని పలు కిరాణా షాపుల్లో వీటిని ఈ గ్యాంగ్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడులు చేసిన పోలీసులు.. తొమ్మిది కేజీల గాంజా చాక్లెట్లను సీజ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు