మా స్టార్ కంపెయినర్‌ను అరెస్టు చేస్తారా? బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ

మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:26 IST)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ పై పోలీసులు అరెస్టు చేసే క్రమంలో దారుణంగా దాడి చేయడం పోలీస్ వాహనంలో పోలీసుల అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డి.కె. అరుణ. 
 
శాసనసభ ఉప ఎన్నిక జరుగుతున్నది  దుబ్బాకలో సిద్దిపేటలో కాదన్నది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. శాసనసభ ఉప ఎన్నిక దుబ్బాక లో ఉంటే పోలీసు యంత్రాంగం సిద్దిపేటలో అభ్యర్థి బంధువుల ఇళ్లలో దాడులు చేయడం అప్రజాస్వామికం.
 
ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధం. సిద్దిపేటలో దాడి చేసిన పోలీసులు గజ్వేల్ లోని ముఖ్యమంత్రి ఫాంహౌస్లో కూడా దాడులు నిర్వహించాలి. సిద్దిపేటలో దాడులు నిర్వహించడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. సిద్దిపేటలో కార్యకర్తలను కలవడానికి వెళ్తున్న శ్రీ బండి సంజయ్ కుమార్‌ను సిద్దిపేటలో పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి రావలసిందిగా పోలీసులు పిలవడంతో గౌరవపూర్వకంగా పోలీస్ సూపరిండెంట్ ఆఫీస్‌కు శ్రీ బండి సంజయ్ కుమార్ వెళ్లడం జరిగింది.
 
అనంతరం బయటకు వచ్చిన శ్రీ బండి సంజయ్ కుమార్ ను పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేస్తూ దాడులకు పాల్పడడం తీవ్రమైంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికకు స్టార్ కంపెయినర్‌గా ఉన్నారు. స్టార్ కంపేయినర్‌ను మధ్యలోనే అరెస్టు చేయడం సరైంది కాదు. స్టార్ కంపెయినర్‌గా వారికి ప్రచారం చేయడానికి ఎన్నికల సంఘం గుర్తింపు కార్డును అదేవిధంగా వాహనానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది.
 
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ దుబ్బాక నియోజక వర్గానికి వెళితే ఘర్షణ జరుగుతాయని మాట్లాడటం, అందుకోసం ముందస్తు అరెస్టు చేస్తున్నామనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమే. గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో పోలీసులు వైఫల్యం చెందుతున్నారా. స్టార్ కంపెయిన‌ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ ఎన్నికల సంఘం పోలీసుల పైన చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.
 
ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా పోలీసుల చేత భయభ్రాంతులకు గురి చేస్తూ ఓడిపోతామనే భయంతో ప్రత్యర్థి పార్టీ బీజేపీపై దాడులు చేయడం అప్రజాస్వామికం. చర్చిద్దామని పిలిచి డోర్లో కాలు ఉండగానే తొక్కుతూ లోపలికి తోయడం దాడి చేయడం అమానుషం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు సిద్ధిపేటకు బయల్దేరారు. ఈ ఎన్నికలను ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
 
ఓటమి భయంతో టిఆర్ఎస్ పార్టీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రత్యర్థి పార్టీ అయినా బీజేపీని నాయకులను అరెస్టులతో దాడులు పోలీసులతో చేస్తున్నది. రేపటి నుంచి బిజెపి స్టార్ కంపెయినర్ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు తదితర నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పన్నాగం పన్నుతున్నది అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు