డిగ్రీలేని వ్యక్తికి దేశంలోనే పెద్ద ఉద్యోగం : ఎమ్మెల్సీ కవిత

ఆదివారం, 2 ఏప్రియల్ 2023 (15:02 IST)
దేశంలో నిరుద్యోక రేటు 7.8 శాతానికి పెరిగిపోయిందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, డిగ్రీ కూడా లేని వ్యక్తి ఈ దేశంలో అతిపెద్ద ఉద్యోగంలో ఉన్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 
 
తాము అధికారంలోకి వస్తే ప్రతి యేటా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ హామీ నీటి మూటలుగా మిగిలిపోయిందన్నారు. మోస పూరిత హామీతో దేశ యువతను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భాజపా, ప్రధాని మోడీపై ఆమె విమర్శలు గుప్పించారు. 
 
కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? కవిత ప్రశ్నించారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ, డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోడీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా ట్వీట్‌ చేశారు.
 
కాగా.. ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్‌ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. 
 
ఈ తీర్పుతో ప్రధాని మోదీ విద్యార్హత విషయంలో అనుమానం మరింత పెరిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం అన్నారు. మోడీ విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుని ఉండకపోయేవారని విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు