తెలంగాణాలో మరో 27 పాజిటివ్ కేసులు

గురువారం, 21 మే 2020 (09:37 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 1661కు చేరాయి. 
 
అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 40కు చేరింది. బుధవారం ఇద్దరు రోగులు ఈ వైరస్ దెబ్బకు చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు 40 మంది చనిపోయారు. 
 
కాగా, ప్రస్తుతం 608 యాక్టివ్ కేసులు ఉండగా, 1013 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూనేవుంది.
 
ప్రైవేటుగా కరోనా పరీక్షలు 
కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కాకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 
 
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయించుకునేందుకు అనేక మంది రోగులు వెనుకంజ వేస్తున్నారు. పైగా, కేవలం గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని అనుకోవడం భావ్యం కాదన్నారు. 
 
అంతేకాకుండా, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై నమ్మకం లేకపోతే... ఆరోగ్యశ్రీ సేవలకు ఎలా అనుమతిచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు... ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. 
 
ఆస్పత్రులు, ల్యాబ్‌లలో వైద్య సిబ్బంది, సదుపాయాలను... ఐసీఎంఆర్‌ పరిశీలించి నోటిఫై చేయాలని తెలిపింది. ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే... కరోనా చికిత్సకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు