తెలంగాణాలో నేటి నుంచి వృద్ధులకు కరోనా టీకాలు

సోమవారం, 1 మార్చి 2021 (07:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో నేటి నుంచి వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వృద్ధులతో పాటు 45 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా వేయనున్నారు. కొవిన్ 2.0 యాప్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదు చేసుకున్న వారికి ఎంపిక చేసుకున్న టీకా కేంద్రాల్లో టీకాలు వేయనున్నట్టు చెప్పారు.
 
ఈ దశలో మొత్తం 50 లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివారం మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. కార్యక్రమం సాఫీగా సాగితే టీకా కేంద్రాలకు నేరుగా వచ్చే వారికి కూడా టీకా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
 
తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో గరిష్టంగా 200 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో టీకాను ఉచితంగానే వేయనుండగా, ప్రైవేటు ఆసుపత్రులలో రూ. 250 వసూలు చేస్తారు. 
 
అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని అధికారులు హెచ్చరించారు. సేవా రుసుము కింద వసూలు చేసే వంద రూపాయలను కూడా ఆసుపత్రులు పూర్తిగా మాఫీ చేయవచ్చని, లేదంటే కొంత తగ్గించి కూడా వసూలు చేసుకోవచ్చన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు