తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శుక్రవారం ఐస్ క్రీమ్స్, జ్యూస్లను విక్రయించాడు. తెరాస బహిరంగ సభ కోసం అవసరమైన నిధుల సేకరణలో భాగంగా ఆయన కూలి పని చేశారు. ఆయనతో పాటు.. రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్, మహేందర్ రెడ్డిలు కూడా కూలి పని చేశారు.
అంతకుముందు.. ఆయన సికింద్రాబాద్ ఆదయ్య నగర్ దళిత బస్తీలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. తమది పేదల, రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. పేదల కోసం 28 రాష్ట్రాల్లో ఎంత ఖర్చు చేశారో అంతకంటే ఎక్కువ తెలంగాణలో ఖర్చు చేస్తున్నామన్నారు.
40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నమన్న ఆయన ఇందుకోసం రూ.5,300 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం సీలింగ్ ఎత్తేసి మనిషికి 6 కిలోల బియ్యం అందజేస్తున్నామన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం రూ.75,116 ఇస్తున్నమని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టి ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నమన్నారు. టీప్రైడ్ ద్వారా శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ చట్టం తీసుకొచ్చామని దీనిద్వారా యువతకు ప్రొత్సాహకం లభిస్తుందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా విదేశీ విద్యకు రూ. 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తున్నట్లు చెప్పారు. పేకాట క్లబ్బులు, గుడుంబాను అరికట్టామన్నారు.