రూ.కోటిన్నర బిల్లును మాఫీ చేసిన ఆస్పత్రి... భారత్‌లో కాదు.. మరెక్కడ?

శుక్రవారం, 17 జులై 2020 (08:52 IST)
సాధారణంగా ఇపుడు ఏ ఒక్క ఆస్పత్రికెళ్లినా జేబుకు కన్నం వేస్తారు. రోగి చనిపోయినా సరే శవానికి చికిత్స చేస్తూ బిల్లులు వసూలు చేసే కాలం. ముఖ్యంగా, మన దేశంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చిన్న రోగానికి ఆస్పత్రికెళ్లినా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పైగా, అంత డబ్బు చెల్లించేలేం మహాప్రభో అంటూ గగ్గోలు పెట్టినా.. ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కానీ, ఆ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా కోటిన్నర రూపాయల బిల్లును మాఫీ చేసింది. అదీ కూడా ఓ తెలుగు రోగి. ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా పెనుగుముట్లకు చెందిన వడ్నాల రాజేశ్ అనే వ్యక్తి పొట్టకూటికోసం దుబాయ్‌కు వెళ్లాడు. అయితే ఏప్రిల్‌లో రాజేశ్ కు కరోనా సోకింది. దుబాయ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. అయితే అతడికి సుదీర్ఘంగా చికిత్స అందించాల్సి వచ్చింది. 
 
ఈ క్రమంలో బిల్లు కూడా దుబాయ్ పరిస్థితులకు తగినట్టు అతి భారీగా వచ్చింది. 80 రోజుల పాటు చికిత్సకుగాను రూ.1.50 కోట్ల బిల్లు వేశారు. దాంతో కరోనా కంటే ఆ బిల్లే రాజేశ్‌ను భయభ్రాంతులకు గురిచేయగా, ఎన్నారై సంఘాలు అండగా నిలిచాయి.
 
బిల్లు వ్యవహారాన్ని దుబాయ్‌లో భారత కాన్సులేట్‌కు నివేదించాయి. కాన్సులేట్ వర్గాలు రాజేశ్ కరోనా చికిత్స బిల్లు వ్యవహారాన్ని దుబాయ్ ప్రభుత్వానికి వివరించాయి. 
 
దీనిపై పెద్దమనసుతో స్పందించిన దుబాయ్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల బిల్లును మాఫీ చేసింది. అంతేకాదు, భారత్ వచ్చేందుకు విమాన ఖర్చులు భరించడంతోపాటు, అదనంగా మరో రూ.10 వేలు ఇచ్చి సహృదయత చాటుకుంది. ఇటీవలే భారత్ చేరుకున్న రాజేశ్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు