దుబ్బాక బైపోల్ : ఓటర్లు ఎవరిపక్షం?... ఎగ్జిట్ ఫలితాలు ఇవే...

మంగళవారం, 3 నవంబరు 2020 (21:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి మంగళవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.రామలింగా రెడ్డి అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరోనా లాక్డౌన్ ఆంక్షలు, నిబంధనల మధ్య పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి. 
 
తాజాగా, థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టినట్టు వివరించింది. 51.54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు తొలిస్థానం లభించినట్టు తెలిపింది. 
 
ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 33.36 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 8.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడోస్థానంలో ఉన్నట్టు థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ వెల్లడించింది.
 
ఇకపోతే, పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో మరో విధమైన ఫలితాలు వచ్చాయి. దుబ్బాకలో బీజేపీదే విజయం అంటూ పొలిటికల్ ల్యాబొరేటరీ పేర్కొంది. బీజేపీకి 47 శాతం ఓట్లు లభించినట్టు తెలిపింది. 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్ రెండోస్థానంలో, 13 శాతం ఓట్లతో కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 
 
మొత్తంమీద ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పోటీ మాత్రం అధికార తెరాస, బీజేపీ పార్టీల మధ్యే కొనసాగింది. ఈ ఇరు పార్టీల నేతలు అకుంఠిత దీక్షతో ఎన్నికల్లో గెలుపు కోసం ముమ్మరంగా కృషి చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు