దుబ్బాకలో తెరాస ఓటమి.. మంత్రి పదవికి హరీష్ రాజీనామా?

శుక్రవారం, 13 నవంబరు 2020 (14:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస ఓడిపోయింది. ఇక్కడ విపక్ష భారతీయ జనతా పార్టీ 1472 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తెరాస సీనియర్ నేత, మంత్రి హరీష్ రావు అహర్నిశలు కృషి చేశారు. రేయింబవుళ్లు అక్కడే తిష్టవేసి విజయం కోసం శ్రమించారు. అయినప్పటికీ ఓటర్లు బీజేపీకి పట్టంకట్టారు. 
 
అయితే, ఈ ఎన్నికల ఫలితంపై తెరాస అధినేత, సీఎం కేసీఆర్ స్పందిస్తూ, దుబ్బాకలో గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉందని వ్యాఖ్యానించారు. గతంకంటే మెజారిటీ వస్తుందని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్‌లు కూడా రావని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చింది.
 
కానీ, బొటాబొటి మెజార్టీతో కూడా గెలవలేకపోయింది. దీంతో సీఎం కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నారు. దుబ్బాక ఎన్నిక బాధ్యతను పూర్తిగా హరీశ్‌రావు చేపట్టినందువల్ల ఓటమి ఎదురైతే ఆయనే స్వయంగా నైతిక బాధ్యత వహించే అవకాశం ఉందని, మంత్రిగా తనంతట తాను బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 
 
అయితే, హరీష్ రావు మంత్రిపదవికి రాజీనామా చేస్తే దాన్ని సీఎం కేసీఆర్ అంగీకరిస్తారా లేదా అన్నది సందేహమే. ఒకవేళ హరీష్ రావు రాజీనామాను అంగీకరించిన పక్షంలో ఆ స్థానాన్ని ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తన కుమార్తె కె.కవితకు ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద దుబ్బాక ఎన్నికల ఫలితం తెరాసలో గుబులు రేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు