తెరాసలో అంతా స్క్రిప్ట్ ప్రకారమే.. సీఎంకు ఇంత అహంకారం ఉంటుందా? ఈటల

మంగళవారం, 4 మే 2021 (16:25 IST)
తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాసలో అంతా  స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతారని.. రాసిచ్చింది మాట్లాడటం తప్ప సొంతంగా మాట్లాడే అధికారం ఎవ్వరికీ లేదన్నారు. 
 
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 20 యేళ్ళలో తెరాస పార్టీలో చాలా చూశానని.. అందరి లిస్ట్ నా దగ్గర ఉందని.. మంత్రులుగాకాకుండా.. మనుషులుగా మాట్లాడాలని హితవు పలికారు. 
 
కనీసం ఆ మంత్రులకు అయినా ఇక నుంచి కేసీఆర్ గౌరవం ఇవ్వాలని కోరుతున్నానని, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నానని ఈటల రాజేందర్ తెలిపారు.  
 
'ఎవరి గురించి కామెంట్ చేయను.. నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చింది టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా పని చేయలేదు.. మంత్రి కేటీఆర్ సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.. స్వాగతించా... నాపై కక్ష సాధించడం సరికాదు.. ఎవరి మాటలపై స్పందించను.. నాతో ఎవరేం మాట్లాడారో తెలుసు. సీఎం అహంకారంపై మంత్రులే మాట్లాడారు. సీఎం‌కు ఇంత అహంకారం ఉంటదా అని వారే అన్నారు' అని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇదిలావుంటే, ఈటల క్యాంప్ కార్యాలయానికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈటల అందరితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం అంటూ అభిమానులకు ప్రశ్న వేయగా... ఏం చేసినా మీ వెంటే ఉంటామని నియోజకవర్గ నేతలు సమాధానమిస్తున్నారు. 
 
మరోవైపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈటల ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెరాసపై పోరుకు ఈటల రాజేందర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు