తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి: జె.పి.నడ్డా

మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:19 IST)
తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ను గద్దెదింపి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా  పిలుపునిచ్చారు. 

తెలంగాణలోని 9 జిల్లాల్లోని బిజెపి కార్యాలయాలకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దిల్లీ నుంచి వర్చువల్ గారాష్ట్రంలోని 9 జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. నడ్డాతో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు దిల్లీ నుంచి పాల్గొన్నారు.

హైదరాబాద్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డా. కె.లక్ష్మణ్ పాల్గొన్నారు. భూమిపూజ జరుగుతోన్న జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రం భీం అసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్జిల్లాల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి ఈ కార్యక్రమం సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో జె.పి.నడ్డా హిందీలో ప్రసంగించగా మురళీధర్ రావు తెలుగులో అనువదించారు. జె.పి.నడ్డా  ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

తెలంగాణలో 9 జిల్లాల్లో బిజెపి కార్యాలయాలకు ఇవాళ భూమిపూజ నిర్వహించుకుంటున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను. ఏవిధంగా అయితే రాష్ట్ర కార్యాలయాలు అన్ని వసతులతో అలరారుతున్నాయో అదేవిధంగా జిల్లా కార్యాలయాలు సైతం ఆధునిక, సాంకేతిక వసతులతో నిర్మితం కానున్నాయి.

కార్యాలయం అంటే స్థలం మాత్రమే కాదు.. లైబ్రరీ, పరిశోధన, సమావేశాలకు వసతులు కల్పిస్తూ పార్టీ పటిష్టతకు దోహదం చేసేలా ఉండాలి.

మొదీ రెండవ విడత తొలి ఏడాది పాలనలో సాధించిన విజయాలను మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. ఇప్పుడు రామజన్మభూమిలో భవ్యరామమందిరం నిర్మాణం కూడా జరుపుకొన్నాం. రామజన్మభూమి సహా మనం సాధించిన చారిత్రాత్మక విజయాల వెనక కార్యకర్తలు కృషి ఉంది.

కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికే దారి చూపెడుతున్నారు. అన్ని దేశాల్లో ప్రభుత్వాలు కోవిడ్ పై పోరాడుతుంటే భారత్ లో మాత్రం ప్రభుత్వంతో పాటు సమాజమూ పోరాడేలా మోదీ స్ఫూర్తి నింపారు. డబ్ల్యూహెచ్ఓ, యూఎన్ లాంటి సంస్థలు కూడా భారత్ ను చూసి నేర్చుకోవాలని కితాబిచ్చాయి.
 
కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటికి దేశంలో ఒక్క కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రి లేదు. ఇప్పుడు 1500 ఆస్పత్రులు ఉన్నాయి. 44వేల బెడ్ల నుంచి 12.5 లక్షల బెడ్లకు, సున్నా నుంచి 1.60 లక్షల ఆక్సిజన్ బెడ్లు, 42వేల ఐసీయూ బెడ్లకు మన సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ 5లక్షల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాం.

‘జాన్ హై తో జహాన్ హై’ అన్న నినాదంతో ఆరోగ్యంతో పాటు ఆర్థికాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టారు. రూ.1.70 లక్షల కోట్లతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రకటించారు. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం, పప్పు అందించారు. వీటిని ఇప్పుడు నవంబర్ వరకు పొడిగించారు.

పేద కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ, మహిళల జన్ ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున రూ.1500 జమ, దివ్యాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లకు రూ.1000 స్టైఫండ్ జమ చేశారు.

కరోనా ఆపదను అవకాశంగా మలచుకోవాలని పిలుపునిస్తూ ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు, వ్యవసాయాభివృద్ధికి 1 లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. పూచీకత్తు లేకుండా వీధి వ్యాపారులకు రుణాలు, కిసాన్ క్రిడెట్ కార్డులు వంటివి ఎన్నో ప్రజలకు మేలు చేస్తాయి.

బిజెపి కార్యకర్తలకు ‘సేవా హీ సంఘటన్’... అంటే సేవే సంస్థ. అందుకే ప్రధాని స్ఫూర్తితో కరోనా కాలంలో ఫీడ్ ది నీడీ కింద 24 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు దేశవ్యాప్తంగా అందజేసాం. తెలంగాణలోనూ 24 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 16 లక్షల మోదీ కిట్లు, 15 లక్షల మాస్కులు, 6800 పీపీఈ కిట్లు బిజెపి కార్యకర్తలు పంపిణీ చేశారు.

తెలంగాణ కార్యకర్తలు వలస కార్మికులకు భోజనం, రవాణా సదుపాయాలు సైతం కల్పించారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నవారి తల్లితండ్రుల బాగోగులు చూసుకున్నారు. వారికి సమయానికి మందులు అందించారు.

సంపర్క అభియాన్ లో భాగంగా డిజిటల్ మాధ్యమంలో 30 లక్షల మందికి బిజెపి తెలంగాణ చేరువైంది. ఇంకా ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరెంతో మందికి పార్టీ చేరువైంది.

కరోనాపై పోరాటంలో మోదీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఆక్సిజన్ అందక ఒక జర్నలిస్టు మృతి చెందడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతుంది.

మోదీ ప్రభుత్వం పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందించేందుకు ‘ఆయుష్మాన్ భారత్’ ప్రవేశపెడితే కేసీఆర్ సర్కార్ మాత్రం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఫలితంగా తెలంగాణలో ఎంతో మంది నిరుపేదలు నాణ్యమైన వైద్యానికి దూరం అవుతున్నారు.

తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ఆరేళ్ల క్రితం 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు 50వేల ఇళ్లు కూడా నిర్మించలేదు. లక్ష ఉద్యోగాలన్నారు.. ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను 85వేల కోట్లకు పెంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోంది.

తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతుగా ఉన్నారు. అందుకే గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిపించారు. తెలంగాణలో మోదీ తరహా పాలన కావాలని కోరుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
దేశహితం కోసం బిజెపి పని చేస్తుంది. బిజెపి కార్యకర్తలుగా ఉండడం పూర్వజన్మ సుకృతం.
చెట్ల కింద, రోడ్లపైనా, అందుబాటులో ఉన్న చోట పార్టీ కార్యకర్తలు కార్యాలయాలుగా నిర్వహించుకున్నారు.ప్రజాస్వామ్య నిర్మాణం కోసం బిజెపి కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణత్యాగం కూడా చేశారు. చివరి వరకు ‘జైశ్రీరాం’, ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు.
యూపీలో బిజెపి కార్యకర్తలపై గత మాయావతి, ములాయం ప్రభుత్వం దమనకాండకు పాల్పడింది. అక్కడ బిజెపి కార్యకర్తలు పోరాడారు. ఇప్పుడు అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. రామాలయ నిర్మాణం కల కూడా సాకారమైంది.
బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అయితే బిజెపి కార్యకర్తలపై దమనకాండ కొనసాగిస్తుందో అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోంది.
ఎంఐఎం, కమ్యూనిస్టు కార్యాలయాలు సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదులకు అడ్డాగా మారాయి. టీఆర్ఎస్ కార్యాలయం కల్వకుంట్ల ఆస్తిగా మిగిలిపోయింది. బిజెపి కార్యాలయం మాత్రమే దేశహితం కోసం పని చేస్తుంది.
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుంటే కేసీఆర్ సర్కార్ బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. అరెస్టు చేస్తున్నారు. 
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపినే.. తెలంగాణలో అధికారంలోకి రావడమే మన లక్ష్యం. ఈ నూతన కార్యాలయాల వేదికగా టీఆర్ఎస్ ను గద్దెదింపి బిజెపి అధికారంలోకి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు