భారతీయ జనతా పార్టీలోకి తెరాస మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరబోతున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 14వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ కాషాయం కండువా కప్పుకోనున్నారు.
భూ కబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది. ఈటల సొంతంగా పార్టీ పెడతారని.. లేదంటే బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈటల తన సన్నిహితులతో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈటల బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్లు స్థానిక నాయకులు వరుస భేటీలు అవుతున్నారు. హుజురాబాద్లో బీజేపీకి గల బలంపై నాయకులు చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువగా 2 వేలలోపు ఓట్లు పోలు కాగా, ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ విజయభేరీ మోగించింది. దీంతో బీజేపీని తెరాస తక్కువగా అంచనా వేయడం లేదు.