ఫేస్‌బుక్‌లో పరిచయం... మరో యువకుడితో మాట్లాడుతోందనీ....

శుక్రవారం, 3 జులై 2020 (09:40 IST)
ఫేస్‌బుక్ పరిచయాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో మరోమారు నిరూపితమైంది. ఎఫ్.బి ద్వారా పరిచయమైన ఓ మహిళ... తనకు తెలియకుండా మరో యువకుడితో మాట్లాడటాన్ని సహించలేని యువకుడు... ఆ మహిళ కుమార్తెను చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్, పోచారంకు చెందిన అనూష అనే మహిళ తన కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమెకు కరుణాకర్ అనే యువకుడితో మూడు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.
 
అయితే, కొన్నిరోజులుగా అనూష... రాజశేఖర్ అనే మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వచ్చింది. ఈ విషయం తెలిసిన కరుణాకర్.. అనూషపై ఆగ్రహంతో రగిలిపోగాసాడు. 
 
ఈ నేపథ్యంలో, కరుణాకర్ గురువారం మధ్యాహ్నం అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ రాజశేఖర్ ఉండడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ రాకతో రాజశేఖర్‌ను అనూష బాత్రూంలో దాచింది. ఈ విషయం పసిగట్టిన కరుణాకర్ బాత్రూం నుంచి బయటికి రాకపోతే చిన్నారి ఆద్యను చంపేస్తానంటూ ఉన్మాదంతో రంకెలేశాడు. కానీ రాజశేఖర్ బయటికి రాకపోవడంతో అన్నంతపనీ చేశాడు.
 
అభంశుభం తెలియని ఆరేళ్ల ఆ చిన్నారి పాపను అత్యంత పాశవికంగా సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోసి చంపేశాడు. దాంతో హడలిపోయిన రాజశేఖర్ బాత్రూం నుంచి వెలుపలికి రాగా, అతడిపైనా కరుణాకర్ దాడి చేశాడు. అయితే ఆ మృగం బారి నుంచి తప్పించుకున్న రాజశేఖర్ పరుగులు తీశాడు. అనంతరం కరుణాకర్ అదే బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
దీంతో భయభ్రాంతులకు గురైన అనూషతో పాటు... ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న కరుణాకరన్‌ను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించిన పోలీసులు ఆద్య తండ్రి కల్యాణ్‌కు ఈ ఘటనపై సమాచారం అందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు