టీఆర్ఎస్‌కు మరో షాకివ్వనున్న బీజేపీ: చింతలగట్టు విఠల్‌కు గాలం

గురువారం, 2 డిశెంబరు 2021 (11:19 IST)
vittal
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కీలక నేతలకు గాలం వేస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన విఠల్ చేరికతో తెలంగాణలో పార్టీ మరింత బలపడే అవకాశాలున్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈటల రాజేందర్ చేరిక, హుజురాబాద్‌లో ఘనవిజయంతో కమలనాథుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే మరో ఉద్యమనేత బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 
 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చింతలగట్టు విఠల్‌ త్వరలో బీజేపీ తీర్థం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విఠల కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
 
టీఎస్‌పీఎస్పీ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత ఆయనకు టీఎస్‌పీఎస్పీ చైర్మన్‌ లేదా ఏదైనా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కవచ్చనే ప్రచారం కూడా జరిగినా అది సాధ్యం కాలేదు. 
 
మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ మార్చడాన్ని తప్పుబట్టారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యమ నేతలతో జరిగిన అంతర్గత చర్చల్లోనూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించారు. 
 
ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసే విషయమై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో విఠల్‌ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా విఠల్‌ను సంప్రదించిన బీజేపీ నేతలు పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు