ఫేస్‌బుక్‌ పరిచయం.. 3 రోజుల పాటు లాడ్జిలో యువతిపై సామూహిక అత్యాచారం..

సోమవారం, 28 డిశెంబరు 2020 (12:53 IST)
ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది. కానీ అదే ఆ యువతికి శాపమైంది. ప్రేమ పేరిట కలుద్దామని పిలిపించిన యువకుడు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా... నరసింహులుపేటకు చెందిన ఓ మైనర్‌ బాలికకు జంగారెడ్డిగూడెంకి చెందిన సింహాద్రి మురారి అనే యువకుడితో ఫేస్‌బుక్‌ పరిచయం ఏర్పడింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న యువతిపై అతను ప్రేమ పేరుతో వల పన్నాడు. కొన్ని నెలల పాటు ఫేస్ బుక్ చాటింగ్ జరిగాక కలవాలన్నాడు. మొదట ఆమె వద్దని చెప్పినా ప్రేమ మైకంలో ఓ రోజు ధైర్యం చేసి బయలుదేరింది. 
 
బస్సులో వచ్చిన ఆ యువతిని అతను రిసీవ్‌ చేసుకున్నాడు. రోజంతా బైక్‌పై చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారు. సాయంత్రానికి ఆమె తిరిగెళ్తానంటూ పట్టుపట్టినా ఒక్కరోజు తనతో ఉండాలని బలవంతపెట్టాడు. చివరికి అతనితో వుండిపోయింది. స్థానికంగా ఉండే ఓ లాడ్డిలో రూం తీసుకున్నారు. మైనర్‌ యువతికి రూం ఇవ్వకూడదని రూల్ ఉన్నా... లాడ్జి ఓనర్ కొడుకుతో ఉన్న స్నేహం వల్ల అవేవీ పట్టించుకోలేదు.
 
మూడు రోజుల పాటు ఆమెను లాడ్జిలోనే ఉంచిన యువకుడు... మధ్యలో తన ఫ్రెండ్స్‌ అంటూ ఇద్దరిని పరిచయం చేశాడు. వారిద్దరూ కూడా ఆమెపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. తనను పంపించేయండంటూ ఆమె బతిమలాడినా పట్టించుకోకుండా 3 రోజుల పాటు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. ఆమె ఫోన్‌ను లాక్కున్నారు. తమకు ఎదురు తిరిగితే చంపుతామని బెదిరించారు. 
 
నాలుగో రోజు ఎలాగొలా తప్పించుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అప్పటివరకూ తమ కూతురి కోసం వెతుకుతున్న వారు... ఆమెను ఓదార్చారు. అప్పటికే ఆమె కోసం తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది.
 
ఈ ఘటనపై అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లాడ్జి ఓనర్‌ ప్రత్యక్ష హస్తం ఉందా.. లేక డబ్బుకు ప్రలోభపడి సాక్ష్యాలైన డైలీ రిజిస్టరు, సీసీ ఫుటేజిని మాయం చేశారా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసుల తీరును మహిళా సంఘాలు, దళిత సంఘాలు ఎండగడుతున్నాయి.
 
అత్యాచారం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఇది మైనర్ యువతికి సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు గోప్యంగా విచారిస్తున్నట్టు చెబుతున్నారు. నిందితుడు మురారిపై పోక్సో చట్టం ప్రకారం కేసు రాశారు. బాధితురాలిని వరంగల్‌లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు