వైభవంగా సీఎం దత్తపుత్రిక వివాహం.. శోభమ్మ చేతుల మీదుగా అరుదైన బహుమతి

సోమవారం, 28 డిశెంబరు 2020 (11:13 IST)
KCR adopted daughter
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి ఘనంగా జరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ లూర్ధుమాత చర్చిలో ప్రత్యూష, చరణ్ రెడ్డిలు ఒక్కటయ్యారు. ప్రత్యూషకు పెళ్లి కానుకగా సీఎం సతీమణి శోభమ్మ ఆదివారం అరుదైన బహుమతిని అందజేశారు. ఆదివారం ప్రత్యూషను పెండ్లి కూతురుగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి శోభమ్మ హాజరై ప్రత్యూషకు పట్టువస్త్రాలు, వజ్రాల నెక్లెస్ బహుకరించి ఆశీర్వదించారు.
 
కాగా, హైదరాబాద్‌ నగరంలోని బండ్లగూడకు చెందిన ప్రత్యూష తల్లిదండ్రులు మనస్పర్థలతో విడిపోయారు. తల్లి 2003లో చనిపోయేముందు తన పేర ఉన్న ఆస్తిని కూతురు ప్రత్యూష పేరిట రాసింది. తండ్రి ఆమెను పట్టించుకోపోవటంతో బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్చించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరింది. ఆ తర్వాత తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు సవతితల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. 
 
భౌతికదాడులకు సైతం పాల్పడింది. తండ్రి కూడా సవతి తల్లికే వత్తాసు పలికారు. ఈ క్రమంలో విషయం అధికారులకు చేరింది. మరణం అంచులకు చేరిన ప్రత్యూషను సవతితల్లి, తండ్రి చెరనుంచి విముక్తి కల్పించి వైద్యం చేయించారు.
 
ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ఆమె కోరిక మేరకు నర్సింగ్‌కోర్సును పూర్తి చేయించారు. ప్రత్యూష ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఆమె కోరిక మేరకు రాంనగర్‌కు చెందిన మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో సోమవారం పెండ్లి జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు