టీవీ చూడొద్దని మందలించిందనీ బాలిక ఆత్మహత్య!

సోమవారం, 8 ఆగస్టు 2016 (11:06 IST)
భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అదే పనిగా టీవీ చూడొద్దని ఓ బాలికను తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన నగర శివారులోని సురారంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే సురారంలో నివసించే సంజయ్ సింగ్ ఓ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రియాకు టీవీ చూడటమంటే భలే సరదా. గంటల తరబడి టీవీకి అతుక్కుపోవడంతో తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు మందలించారు. అయితే తనను అదే పనిగా మందలిస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురైన రియా కుమారి.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
ఇదిలావుంటే తల్లిదండ్రులు యధావిధిగా విధులకు వెళ్లారు. ఇద్దరు సోదరులు కూడా పాఠశాలకు వెళ్తున్నప్పుడు.. మీరు వెళ్లండి అంటూ రియా అన్నలను స్కూల్‌కు పంపించింది. సోదరులు సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి రాగానే గది లోపలి నుంచి గడియపెట్టి ఉండడం, ఎంతకీ తీయకపోవడంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపులు తెరిచి చూశారు. 
 
ఇంట్లో ఉరేసుకుని కనిపించిన రియాను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడిని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి