తెలంగాణాలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (17:33 IST)
వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. 
 
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పెను తుఫానుగా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా - దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాలపూర్, కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
 
అందువల్ల ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. మత్స్యకారులు ఈ రెండు రోజులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. 
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 
 
ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని అధికారులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు