భార్య కోసం భర్త క్షుద్రపూజలు - కొత్తగూడెంలో కలకలం

సోమవారం, 6 డిశెంబరు 2021 (09:31 IST)
కుటుంబ కలహాల కారణంగా తనకు దూరమైన భార్యను తిరిగి తన వద్దకు చేర్చుకునేందుకు ఓ భర్త తన స్నేహితుల మాటలు విని క్షుద్రపూజలు చేయించాడు. ఆ విషయం అత్తారింటికి తెలిసి అతన్ని చావబాదారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శేఖరంబంజరకు చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఈయనకు నాలుగేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి సంతానం లేదు. దీనికితోడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇవి మరింత పెద్దవి కావడంతో భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
అయితే, భార్య ఎడబాటును జీర్ణించుకోలేని భర్త.. ఆమె కోసం పలుమార్లు ఫోన్లు చేశాడు. కానీ, ఆమె స్పందించలేదు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారిచ్చిన సలహా మేరకు క్షుద్రపూజలు చేయించాలని నిర్ణయించి, రెండు నెలల క్రితం ఓ మాంత్రికుడిని సంప్రదించాడు. ఇందుకోసం 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేయించాడు. 
 
ఆ తర్వాత నాలుగు రోజులకే భార్య నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సంతోషంతో భార్య వద్దకు వెళ్లాడు. అయితే, అప్పటికే వారికి ఆతను చేసిన క్షుద్రపూజల వ్యవహారం తెలిసింది. దీంతో అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ క్షుద్రపూజల వ్యవహారానికి సంబంధించి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు