కరోనా సవాల్ : జీహెచ్ఎంసీలో 12 కంటైన్మెంట్ క్లస్టర్లు

గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:52 IST)
కరోనా వైరస్ మానవాళికి సవాల్ విసురుతోంది. ఎలాంటి ఔషధాలకు లొంగని వైరస్‌గా నిర్ధారణ అయింది. అందుకే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ఏకైక మార్గం.. ప్రతి పౌరుడూ సామాజిక భౌతికదూరాన్ని పాటించడమే ఉత్తమమని ప్రతి ఒక్కరూ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగిపోతోంది. ఇందులోభాగంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉమ్మి వేయడాన్ని నిషేధించారు. 
 
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరం అంటే జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కువగా ఉన్న 12 ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించింది. 
 
ఇందులో రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ సహా పలు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ మూడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతాలను అధీనంలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
ఇకపోతే, హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో 89 మంది ఆయా ప్రాంతాల వారే కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తారు. 
 
వ్యాధి లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్‌కు కానీ, ఐసోలేషన్‌కు కానీ తరలిస్తారు. వీధులను శుభ్రం చేసి క్రిమి సంహారక ద్రావణాలతో పిచికారీ చేస్తారు. అంతేకాదు, ఆ ప్రాంతాల్లోని వ్యక్తులు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు