నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో... బాలికకు విషమిచ్చిన కామాంధుడు..

గురువారం, 15 ఏప్రియల్ 2021 (07:40 IST)
హైదరాబాద్ నగరంలో మరో బాలిక అత్యాచారానికి గురైంది. తన ఇంట్లో అద్దెకు దిగిన కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక దాడికి దిగాడు. ఆ బాలికను లొంగదీసుకున్న కామాంధుడు... పలుమార్లు అత్యాచారం చేశాడు. అతని వేధింపులు భరించలేని ఆ బాలిక.. ఎదురుతిరిగింది. విషం తాగి చస్తా కానీ, లొంగనంటూ ప్రతిఘటించింది. అయినా, నిన్ను వదిలేది లేదంటూ.. కావాలంటే చచ్చిపో అంటూ విషం తెచ్చి ఇచ్చాడు. రోజూ అతడి చేతిలో చావటం కంటే, ఒకేసారి చనిపోదామని ఆ బాలిక విషం తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తనపై జరిగిన దారుణాలను పోలీసులకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడిన విషయం తెల్సిందే. దీంతో జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంటి వద్దే ఉంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతోంది. వారు అద్దెకు ఉండే ఇంటి యజమాని కుమారుడు వై. మధుసూదన్‌ రెడ్డి ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడేవాడు. 
 
ఆమె తండ్రి ఫోన్‌కు కాల్‌ చేసి, బాలికను మాట్లాడమని వేధించేవాడు. ఆమె తండ్రి డ్యూటీ నుంచి వచ్చే భార్యను తీసుకురావడానికి రోజూ వెళ్తాడు. ఆ సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన మధుసూదన్‌ ఆ సమయంలో ఇంట్లోకి చొరబడి, తలుపులు మూసి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తతంగాన్ని వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులను చంపేస్తానని, వీడియోలు, ఫొటోలు బయటపెడతానని తరచూ లైంగికదాడికి పాల్పడేవాడు. 
 
ఈ నెల 10న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో మరోసారి లైంగికదాడికి యత్నించగా, ఆమె ప్రతిఘటించింది. బలవంతం చేస్తే నీ పేరు రాసి చచ్చిపోతానని బెదిరించింది. అయితే, మధుసూదన్‌ సోమవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఉన్న బాలిక దగ్గరకు వచ్చి ‘నాకు లొంగితే సరే.. లేదంటే చచ్చిపో’ అంటూ విషం బాటిల్‌ ముందు పెట్టాడు. 
 
ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాలిక విషం తాగింది. ఆమె పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించారు. బాలిక స్ప్రహలోకి రావడంతో పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఆమె జరిగిన విషయం చెప్పడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరింది. జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు