లాక్డౌన్ ఆంక్షలు : రోడ్డెక్కితే కోర్టుకెళ్లాల్సిందే .. పోలీసుల వార్నింగ్

బుధవారం, 26 మే 2021 (11:44 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భగాంగా కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ అమలు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 
 
అయితే.. చాలాచోట్ల లాక్డౌన్ లాంటిదే కనిపించడం లేదు. కొంతమంది అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసులు గట్టి హెచ్చరికలు జారీచేశారు. లాక్డౌన్‌ సమయంలో అనవసరంగా వాహనాలతో రోడ్లపై తిరిగితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
 
ఉదయం 10 గంటల తర్వాత ఈ-పాస్‌ లేకుండా తిరుగుతున్న వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. అలా సీజ్ చేసిన వాహనాల్ని లాక్డౌన్‌ పూర్తయ్యే వరకు తమ అధీనంలోనే ఉంచాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అలా పట్టుబడిన వాహనాలు రోజుల తరబడి వినియోగించక దెబ్బతినే అవకాశాలున్నాయని.. అందరూ గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. 
 
కొంతమంది అనవసరంగా బయట తిరుగుతున్నారని.. కఠిన చర్యలు తీసుకోక తప్పదని పేర్కొంటున్నారు. సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్‌ అనంతరం న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ వాహనంపై గత లాక్డౌన్‌లోనూ ఉల్లంఘనలుంటే.. ‘రిపీటెడ్‌ అఫెండర్లు’గా పరిగణించి అదనంగా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 
 
అందువల్ల వాహనం సీజ్ అయిన వాహనదారులు కోర్టు మెట్లాక్కిల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అక్కడ న్యాయమూర్తి విధించే జరిమానా చెల్లించి ఆ రసీదుని పోలీస్‌ స్టేషన్‌లో చూపించి.. వాహనాన్ని తీసుకోవాలి. అయితే.. అలాంటి వాహనాలపై గతంలో జారీ అయిన ఈ-చలానాల బకాయిలుంటే వాటినీ చెల్లించాకే పోలీసులు వాహనాన్ని వదిలిపెడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు