సింగిల్‌ డేలో సరికొత్త రికార్డును సృష్టించిన హైదరాబాద్ మెట్రో

మంగళవారం, 4 జులై 2023 (19:04 IST)
హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ నెల 3వ తేదీన మెట్రో రైలులో ఏకంగా 5 లక్షల 10 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారు. వీరిలో నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ నుంచి కూకట్ పల్లి మార్గంలో అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. అలాగే, ఈ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. 
 
కాగా, భాగ్యనగరిలో గత 2017 నవంబరు 29వ తేదీన హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి క్రమక్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. హైదరాబాద్ నగరంలోని రహదారుల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉండటంతో భాగ్యనగరి వాసులు అధికంగా మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆఫీస్ వేళల్లో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. అమీర్‌పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఫలితంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సేవల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు