ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం... జార్ఖండ్ వలస కూలీలు దుర్మరణం

మంగళవారం, 10 నవంబరు 2020 (11:05 IST)
సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాటి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 
 
ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు జార్ఖండ్‌ ఘోరఖ్‌పూర్‌, రాంఘడ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనం గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
అయితే ఈ ప్రమాదం గురించి... పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఢిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వైపు ఔటర్ రింగురోడ్డు మీదుగా వెళ్తున్నారు. పాటిగ్రామ శివారులో అదే రోడ్డుపై వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒకటి బొలేరోను ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు