తెరాస వద్దంది.. బీజేపీ రమ్మంది... అందుకే కాంగ్రెస్‌కు గుడ్‌బై..

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యంత కీలక నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకరు. వీరిద్దరూ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర నేతలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ తమకేమాత్రం ప్రాధాన్యత లేకపోవడంతో వారు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. 
 
దీంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీపీసీసీ ప్రక్షాళన లేదని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటిస్తే.. తమ దారి తాము చూసుకుంటామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే తాము పార్టీలో ఉండమని, ఉత్తమ్ వల్లే తెలంగాణ మూడేళ్లు ఆలస్యమైందని, నాడు తాను వదిలేసిన మంత్రి పదవిని ఆయన తీసుకున్నాడని విమర్శించారు. 
 
ఉత్తమ్ కుమార్ లాబీయింగ్ చేసి టీపీసీసీ పదవిని సంపాదించుకున్నారని, తనను పొమ్మనలేక పొగపెడుతున్నాడని, సోషల్ మీడియా ద్వారా తమపై ఆయన దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ శిక్షణా తరగతుల్లో తనను కావాలనే అవమానించారని, కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో 2019 ఎన్నికలకు వెళ్తే ఐదారు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావని కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. 
 
ఇదిలావుంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17వ తేదీన నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఇందులో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొననున్నారు. ఆ సమయంలో రాజ్‌నాథ్‌తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ కానున్నారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ వర్గాలు ఒప్పుకోకపోవడంతో ఆఖరికి బీజేపీ వైపు కోమటిరెడ్డి బ్రదర్స్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు