కేసీఆర్ పుట్టుక‌తోనే అబ‌ద్దాలు: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:48 IST)
కేసీఆర్ పుట్టుక‌తోనే అబ‌ద్దాలు పురుడుపోసుకున్నాయ‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు తిన‌డానికి తిండిలేని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఇప్పుడు కోట్ల‌కు ఎలా ప‌డిగాలు ఎత్తార‌ని ప్ర‌శ్నించారు. నేడు న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేశారు.
 
ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టుక‌తోనే భూమి మీద అబ‌ద్దాలు పురుడు పోసుకున్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రి చేస్తా... 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని... ద‌ళితుల‌కు మూడెక‌రాలు భూమి ఇస్తాన‌ని అబ‌ద్దాలు చెప్పి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి కేసీఆర్ సీఎం అయ్యార‌ని మండిప‌డ్డారు. సీఎం అయ్యాక ప్ర‌జ‌లను ప‌ట్టించుకోకుండా క‌మీష‌న్ల మీద దృష్టి పెట్టాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. 
 
రాజ‌కీయాల‌కు రాక‌ముందు పాస్‌పోర్టు బ్రోక‌ర్‌గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు ల‌క్ష కోట్ల‌కు ప‌డ‌గ‌లు ఎత్తార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ బ‌డ్జెట్‌కు స‌మానంగా ల‌క్ష కోట్ల ఆస్తులు కేసీఆర్‌ కూడబెట్టుకున్నాడ‌ని ఆరోపించారు. కాళేశ్వ‌రంలో దోచుకున్న డ‌బ్బుతో రాష్ట్ర‌మంతా  ప్ర‌తి గ్రామంలో 500 ఇళ్లు క‌ట్టించ‌వ‌చ్చ‌ని తెలిపారు. 
 
తెలంగాణ కోసం 1200 మంది యువ‌త ప్రాణాలు తీసుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు రాక యువ‌త ప్రాణాలు తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌కుండా యువ‌తను ఇబ్బందులు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. సునీల్ నాయ‌క్ చ‌నిపోతూ రాష్ట్రంలోని  ప్ర‌తి ఒక్క యువ‌తకు ఉద్యోగం వ‌చ్చే విధంగా మ‌న‌పై బాధ్య‌త పెట్టి పోయాడన్నారు. సునీల్ నాయ‌క్ కోరిక తీర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని కోరారు. 
 
అలాగే న‌ల్గొండ ఇంఛార్జీ జ‌గ‌దీష్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏడేళ్లుగా టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న నువ్వు సూర్యాపేట‌కు తాగునీరు అందించ‌ని జ‌గ‌దీష్ రెడ్డి న‌కిరేక‌ల్‌లో ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని మండిప‌డ్డారు. జ‌గ‌దీష్ రెడ్డి హ‌యంలో ఇప్ప‌టికీ సూర్యాపేట వెన‌క‌బ‌డి ఉంద‌ని.. అలాంటిది న‌కిరేక‌ల్ అభివృద్దికి నువ్వు కృషిచేస్తాన‌ని చెబితే ఎలా న‌మ్మేది అని ప్ర‌శ్నించారు.

20ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న నాపై ఎలాంటి అవినీతి మ‌చ్చ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అలాంటిది ఏడేళ్లలో వంద‌ల కోట్ల అవినీతిని జ‌గ‌దీష్ రెడ్డి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు.  2014 ఎన్నిక‌ల‌కు ముందు తినడానికి లేని వ్య‌క్తి ఇప్పుడు ఎలా కోటీశ్వ‌రుడు అయ్యాడని ప్ర‌శ్నించారు.
 
న‌కిరేక‌ల్ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ చేతిలో ఓట‌మి ఖాయ‌మ‌ని తెలిసి.. కాంగ్రెస్ నేత‌ల‌ను కొనే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆ చ‌ర్య‌లు తిప్పికొట్టడంతో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఓడించ‌డానికి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని విమ‌ర్శించారు. రానున్న 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్దికి వెయ్యి ఓట్లు రావ‌ని స్ప‌ష్టం చేశారు.

అవ‌స‌ర‌మైతే న‌కిరేక‌ల్ లో తిష్ట వేసి కాంగ్రెస్ అభ్య‌ర్ధిని భారీ మెజారిటీతో గెలిపిస్తాన‌ని తెలిపారు. న‌కిరేక‌ల్ మార్కెట్ యార్డులో ఆరుగంట‌లు ధ‌ర్నా చేస్తేనే ధాన్యం కొనుగోలు ప్రారంభించార‌ని తెలిపారు. రైతులను చిన్న‌చూపు చూస్తున్న టీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే అర్హ‌త లేద‌న్నారు. 
 
న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌లో ఓటేసే ముందు ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, యువ‌త‌కు ఉద్యోగం, అర్హులైన అంద‌రికీ ఫించ‌న్లు వ‌స్తున్నాయో లేదో ఆలోచించాలి అని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మీ త‌ర‌పున ప్ర‌తి విష‌యంలో గొంతెత్తి ప్ర‌శ్నిస్తామ‌ని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు