దేశం దారి తప్పుతోంది.. 24 గంటలూ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే?!

బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:58 IST)
కాళేశ్వర గంగమ్మ ప్రస్థానంలో మరో ఉజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టీఎంసీల అతి పెద్దదైన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం జాతికి అంకితం చేశారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశం దారి తప్పుతోంది…దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది.. దేశం చెడిపోవద్దు కాబట్టి…ముందుకు వెళ్లాలి.. దుర్మార్గమైన, అసహ్యం పుట్టించే పనులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
 
కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళుతాయన్నారు. ప్రశాంత వాతావరణమంటే సంపద, పరిశ్రమలు, భూ సంపదలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌లో మతకల్లోలాలు వస్తే.. పరిశ్రమలు వస్తాయా ? అని ప్రశ్నించారు.
 
ఇలాంటి క్యాన్సర్‌ను తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఏది చేటో దానిని నిలదీసి ఎదుర్కొంటామన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకెళుతున్నట్లు, చివరి రక్తపుబొట్టు వరకు దేశాన్ని సెటిల్ చేస్తానని తెలిపారు. 
 
హైదరాబాద్‌లో లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నట్లు, అంతర్జాతీయ విమానాలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథం దూసుకపోతోందన్నారు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా ? అంటే అది తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. 
 
జాతీయ రాజకీయాల వైపు సీఎం కేసీఆర్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు