తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాటిచెట్టు ఎక్కి కల్లు గీశారు. ఆయన గురువారం జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాలకుర్తి మండలం, మల్లంపల్లిలో స్వయంగా గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. నిచ్చెన వేసుకుని తాటి చెట్టు ఎక్కిన మంత్రి ఎర్రబెల్లి.. అక్కడ కల్లుతో నిండివున్న కల్లు ముంతను కిందికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అందులోని కల్లును గ్లాసులో పోసుకుని హాయిగా ఆస్వాదిస్తూ తాగారు.
సాధారణ తాటిచెట్లు ఎంతో ఎత్తుకు పెరుగుతాయని, కానీ, గిరక తాటిచెట్లు మాత్రం తక్కువ ఎత్తులో స్వల్పకాలంలో కల్లుగీతకు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పైగా, గిరక తాటి చెట్లను ఎక్కడం కూడా చాలా సులువు అని చెప్పారు. ప్రమాదాలకు అవకాశం ఉండదని భావించిన తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఈ తరహా తాటి చెట్లను పంపిణీచేస్తుంది. వాస్తవానికి ఈ తరహా తాటిచెట్లు బీహార్ రాష్ట్రంలో అత్యధికంగా ఉంటాయి.