తెలంగాణ ప్రభుత్వంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్

బుధవారం, 22 జులై 2020 (21:12 IST)
దక్షిణ తెలంగాణకు అశనిపాతంగా మారిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు కడు దయనీయంగా ఉందని బీజేపీ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్‌తో చరవాణిలో సంభాషించారు.
 
తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు సమీక్ష చేసి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు టెండర్ల ప్రక్రియపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను బూచిగా చూపి ఏపీ రీ-ఆర్గనైజేషన్ చట్టానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు.
 
ఏపీ ప్రభుత్వ 203 జీవోపై ప్రధానమంత్రి కార్యాలయానికి కేంద్ర జలశక్తి కార్యాలయానికి పలుమార్లు ప్రత్యుత్తరాలు జరిపానని తెలిపారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రజత కుమార్‌కు పంపించినట్లు సుధాకర్ రెడ్డి వివరించారు. ఒకవైపు రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
రైతుల న్యాయపోరాటానికి సంపూర్ణంగా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను నిలువరించి టెండర్ల ప్రక్రియను రద్దు చేయడానికి న్యాయపోరాటం చేయాలని ఆయన రజత్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు