నేడు పీవీ జయంతి ... శతజయంతి వేడుకలు ముగింపు

సోమవారం, 28 జూన్ 2021 (09:28 IST)
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముగింపు వేడుకలకు భారీ సన్నాహాలు చేసింది. నెక్లెస్‌ రోడ్డులో రాష్ట్ర ప్రభుత్వం పీవీ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించనుంది. పీవీ జ్ఞానభూమి వద్ద నిర్వహించే శత జయంతి వేడుకల్లో గవర్నర్‌ తమిళసై సీఎం కేసీఆర్‌ పాల్గొని నివాళులర్పిస్తారు. 
 
కాగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరాభవన్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పీవీ శత జయంతి ముగింపు వేడుకల్లో జూమ్‌ ద్వారా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రసంగిస్తారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త, రాజనీతిలో అపరచాణక్యుడిగా అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు అందుకున్న తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానిగా దేశానికి అందించిన సేవలను చిరస్మరణీయంగా తలుచుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 
 
నేటి రాజకీయాల్లో ప్రధానంగా యువతలో పీవీ రాజకీయ స్ఫూర్తిని నింపేందుకు వీలుగా ఏడాది పాటు వివిధ రకాల సభలు, సమావేశాలు, చర్చాగోష్ఠులు, తదితర కార్యకలాపాలను దేశ విదేశాల్లో నిర్వహించారు. పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల పితామహుడు అని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కొనియాడారు. 
 
పీవీ శత జయంతి సందర్భంగా ఆదివారం మీడియాకు ఆయన తన సందేశాన్ని విడుదల చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖ నిర్వహించిన ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కన్వీనర్‌ మహేష్‌ బిగాల పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు