తెలంగాణా ఎన్నికలు : పోటీ నుంచి తప్పుకున్న షర్మిల.. కాంగ్రెస్‌కు మద్దతు

శుక్రవారం, 3 నవంబరు 2023 (14:58 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని భారాస ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగపోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులన్నా.. కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఇటీవల ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసినపుడు తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని చెప్పారు. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించామని, తమ పార్టీ తరపున కొందరు అభ్యర్థులను బరిలోకి దించాలని భావించామన్నారు. అదేసమయంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆమె జోస్యం చెప్పారు. 
 
అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలరాదన్న నిర్ణయంతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాము నిర్ణయించినట్టు చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, నాయకులంతా అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు