తెలంగాణ‌లో ఇంత ఘోర‌మా? ప్ర‌శ్నించేవారే లేరా? సుప్రీంకోర్టు విస్మ‌యం

మంగళవారం, 13 జులై 2021 (22:58 IST)
పి.డి యాక్ట్ టిఆర్ఎస్ సర్కార్‌కు వరంలా మారింది. ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించిన చిన్నా చితకా కేసుల్లో 5 కేసులు ఉంటే చాలు నోటీసు ఇవ్వకుండా ఏడాది పాటు లోపల వేసేందుకు అనుకూలంగా ఉండే పి.డి యాక్ట్ అందరిపై ప్రయోగిస్తున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ పోలీసులను అభాసుపాలు చేస్తోంది.

ఈ క్రూరమైన విధానంపై అత్యున్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న పిడియాక్ట్ ఏంటి..? దాని అమలు విధానం ఏవిధంగా ఉండాలి..? కక్ష పూరితంగా అమలు అయ్యే పీడీ యాక్ట్ .. ఎలా దారి తప్పుతోంది..? నాయకులను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం..? స్పెషల్ స్టోరీ.
 
తెలంగాణ పోలీసులు పీడీ యాక్ట్ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్న తీరుపై సుప్రీంకోర్టు విస్తుపోయింది. పీడీ యాక్ట్‌ను అత్యంత‌ క్రూరమైన చట్టంగా అభివర్ణించిన న్యాయ‌స్థానం.. తెలంగాణ‌లో ఇంత‌వ‌ర‌కు ఈ చ‌ట్టం అమలును స‌వాల్ చేసిన‌వారే లేక‌పోవ‌డంపై ఆశ్చ‌ర్య‌పోయింది. బెయిల్ మంజూరైన వ్య‌క్తుల‌ను కూడా పోలీసులు త‌మ అదుపులో ఉంచుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించింది. పీడీ యాక్ట్ పేరుతో పోలీసులు నిందితుల‌ను నిర్బంధంలో ఉంచితే.. ఇక బెయిల్ వ‌చ్చిన ఏం ప్ర‌యోజనం అని నిల‌దీసింది.
 
స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డుల పేరుతో మోసానికి పాల్పడ్డాడంటూ ఒక వ్యక్తిపై మేడ్చ‌ల్ పోలీస్ స్టేష‌న్‌లో ఐదు కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఐదు కేసుల్లోనూ నిందితుడు బెయిల్ పొందాడు. కానీ పోలీసులు అత‌న్ని పీడీ యాక్ట్ లోని సెక్ష‌న్ 3 కింద మ‌ళ్లీ నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసుల చ‌ర్య‌ను సవాలు చేస్తూ ఆయన భార్య తొలుత హైకోర్టును ఆశ్ర‌యించింది. కానీ అక్క‌డ పోలీసుల‌కే అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ఆమె హైకోర్టు తీర్పు, పోలీసుల చ‌ర్య‌ను స‌వాల్ చేస్తూ ఈసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది.
 
బాధితురాలి పిటిషన్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం ధర్మాసనం ఆశ్చ‌ర్య‌పోయింది. ఈ చట్టాన్ని ఎవరూ సవాలు చేయలేదా? ఇది క్రూరమైన చట్టం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చ‌ర్య‌ వ్య‌క్తి స్వేచ్ఛ‌, ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగించ‌డ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డింది. వారం రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు తెలంగాణలో గ‌తేడాది రాష్ట్ర‌వ్యాప్తంగా 350 మందిపై ప్ర‌భుత్వం పీడీ యాక్ట్ ప్ర‌యోగించిన‌ట్టుగా తెలిసింది. ఇందులో 267 మంది.. రాచకొండ‌, హైద‌రాబాద్, సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని పోలీసుల నిర్బంధంలో ఉన్నార‌ని అంచ‌నా.
 
వాస్త‌వానికి ఎవ‌రైన వ్య‌క్తిపై పీడీయాక్ట్ ప్ర‌యోగిస్తే.. దాని స‌హేతుక‌త‌పై 45 రోజుల్లో ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీ స‌మీక్షించాలి. ఆ త‌ర్వాత క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై పీడీ యాక్ట్ బాధితుడు కోర్టులో స‌వాల్ చేసుకోవ‌చ్చు. కానీ ఇక్కడ క‌మిటీ పీడీ యాక్ట్ స‌మీక్షించేందుకు 45 రోజుల కంటే ఎక్కువే స‌మ‌యం తీసుకుంటోంది. దీంతో చాలా మంది నెల‌ల త‌ర‌బ‌డి నిర్బంధంలోనే మ‌గ్గిపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు