డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన యాపిల్ ముక్క

సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరుకు చెందిన జానపద కళాకారుడు ఏ.శంకర్‌ అనే వ్యక్తి నాలుగో కుమార్తె ఝాన్సీ సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న యాపిల్‌ తీసి కట్ చేసి ఆరగిస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ విద్యార్థినికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. 
 
వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే లోపే ఝాన్సీ కన్నుమూసింది. అకారణంగా బిడ్డ మరణించడంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

వెబ్దునియా పై చదవండి