రూ.100కు బదులు రూ.500... ఎగబడి డ్రా చేసిన జనాలు

ఆదివారం, 16 మే 2021 (09:13 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా అమరచింతలో ఓ వింత జరిగింది. ఏటీఎం కేంద్రం నుంచి రూ.100 నోట్ల స్థానంలో రూ.500 నోట్లు వచ్చాయి. ఈ విషయం తెలిసిన జనాలు... ఎగబడి డ్రా చేశారు. ఏటీఎం యంత్రంలో తలెత్తిన పొరపాటు కారణంగా ఇలా జరిగింది. డబ్బు డ్రా చేసినవారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి తిరిగి ఇవ్వాలని లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఏటీఎం నిర్వహణ అధికారి హెచ్చరించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వనపర్తి జిల్లా అమరచింతలోని ఇండియావన్‌ ఏటీఎం కేంద్రంలో శనివారం ఓ కస్టమర్‌ రూ.4 వేలు విత్‌డ్రా చేసుకోగా.. వంద నోట్ల స్థానం‌లో ఐదొందల నోట్లు వచ్చాయి. మొత్తం రూ.20 వేలు చేతికి అందాయి. దాంతో అతడు అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులకు చేరవేశాడు. వారి ద్వారా అమరచింత పరిసర గ్రామాలకు వ్యాపించింది. 
 
దాంతో ఆ ఏటీఎం కేంద్రానికి బ్యాంకు ఖాతాదారుల తాకిడి పెరిగింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి జనాలు ఎగబడ్డారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ సిబ్బంది.. విషయాన్ని ఆరా తీశారు. వెంటనే ఏటీఎం కేంద్రానికి తాళం వేయించి, నిర్వాహకులకు సమాచారం అందించారు. ఏటీఎంలో నగదును లోడ్‌ చేసినప్పుడు.. రూ.100 నోట్ల ట్రేలో రూ.500 నోట్లను పొరపాటున పెట్టినట్లు అధికారులు గుర్తించారు. 
 
ఇలా మూడు రోజుల్లో రూ.5.88 లక్షల మేర అతనపు విత్‌డ్రావల్స్‌ జరిగినట్లు లెక్క తేల్చారు. అదనంగా డబ్బులు డ్రా అయిన వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేసి, డబ్బులు రికవరీ చేస్తామని ఏటీఎం ఏజెన్సీ టెక్నికల్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు