జనవరి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీస్‌లు

శుక్రవారం, 20 డిశెంబరు 2019 (06:02 IST)
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా టీఎస్ఆర్టీసీ.. అభివృద్ధి కోసం సంస్కరణల బాట పట్టింది.  ముందుగా ప్రకటించినట్లుగా ఆర్టీసీ ఆర్ధిక పటిష్టతలకు చర్యలు చేపడుతున్నది ఆ సంస్థ యాజమాన్యం..

దీనిలో భాగంగా  తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు జనవరి ఒకటో తేది నుంచి  తిరుగనున్నాయి.  హైదరాబాద్ లో ఆర్టీసీ ఈడీలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది. రెడ్ కలర్ తో బస్సును తీర్చిదిద్దింది.

కార్గో బస్సు డ్రైవర్, సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ కేటాయించింది. జనవరి 1 నుంచి కార్గో బస్సు సర్వీసులు ప్రారంభించనున్నారు.  టీఎస్‌ఆర్టీసీలో కార్గో సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. మొదటిదశలో వివిధ ప్రాంతాలు, జిల్లాల్లో ప్రైవేటువ్యక్తుల నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు.

అనంతరం ప్రభుత్వానికి సంబంధించి వస్తురవాణాను చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వశాఖల్లో మొదటగా వ్యవసాయ, పౌరసరఫరాలశాఖ రవాణాపై దృష్టిసారించనున్నారు. పీడీఎస్‌ బియ్యం, వ్యవసాయోత్పత్తులు, తదితరాలను ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తారు. తదుపరి విద్యాశాఖ, పరిశ్రమలశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖలకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ప్రైవేటుకార్గో సర్వీసులకు దీటుగా ఆర్టీసీ సర్వీసులను నిర్వహిస్తామని అధికారులు   చెప్తున్నారు.  . ఈ మేరకు డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మొదటివిడతగా 1209 మంది సిబ్బందిని, 822 ఆర్టీసీ డీజీటీ సర్వీసులను తీసుకురానున్నారు.

ఒక్కో డిపోకు రెండు డీజీటీ వెహికిల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. హైదరాబాద్‌ నగరంలోని 29 డిపోల్లో సుమారు 60 డీజీటీలు అందుబాటులోకి రానున్నాయి. మిగతావాటిని జిల్లాల్లోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు