సౌదీ అరేబియా జైలులో జగిత్యాల వాసి గుండెపోటుతో మృతి

బుధవారం, 7 సెప్టెంబరు 2022 (10:23 IST)
సౌదీ అరేబియా జైలులో జగిత్యాలకు చెందిన ఓ ఖైదీ మృతి చెందాడు. ఉపాధి కోసం వెళ్లిన ఆయన వీసా గడువు ముగియడంతో అక్కడే ఉండి పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈయన్ను జైల్లో బంధించారు. అయితే, ఆయన జైల్లో గుండెపోటుతో మరణించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం, మన్నేగూడేనికి చెందిన రాజయ్య అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అయితే, ఆయన వీసా గడువు ముగిసిపోయింది. 
 
అయినప్పటికీ  ఆయన అక్కడే ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత కరోనా మహమ్మారి సమయంలో ఆయన పరిస్థితులు మరింత కఠినంగా తయారయ్యాయి. దీంతో ఆయన స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నించాడు. 
 
ఆ సమయంలోనే రాజయ్య పోలీసులకు చిక్కాడు. వీసా గడువు ముగిసినా దేశంలో అక్రమంగా ఉంటున్నందుకు సౌదీ పోలీసులు అరెస్టు చేసి రియాద్‌లోని డిపోర్టేషన్ సెంటరుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యంబారినపడ్డారు. 
 
దీంతో గత నెల 15వ తేదీన జైలు నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో గుండెపోటుకుగురై ప్రాణాలు విడిచాడు. ఈయన మృతి విషయం సౌదీలోని భారత రాయబార కార్యాలయం నుంచి మంగళవారం జగిత్యాలలోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు