తెరాసకు షాకివ్వనున్న దుబ్బాక ఉప ఫలితం... విజయం దిశగా బీజేపీ!

మంగళవారం, 10 నవంబరు 2020 (12:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం షాకివ్వనుంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మొదటి నుంచి బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు తెరాస అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు. 
 
ప్రస్తుతం ఐదు రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తర్వాత, బీజేపీ అన్ని రౌండ్లలోనూ ఎంతో కొంత ఆధిక్యాన్ని చూపిస్తూ వచ్చింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెజారిటీ 3 వేల ఓట్లకు అటూ ఇటుగా ఉన్నా, మరో 15 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉండటంతో, ఈ పోరు హోరాహోరీగా సాగుతుందని, టీఆర్ఎస్‌కు విజయం అంత సులువుకాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
అయితే, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఆయన స్వగ్రామమైన పోతారంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి నామమాత్రపు ప్రభావాన్నే చూపుతుండగా, ఒక్కో రౌండ్ ముగిసేకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. రఘునందన్ రావుకు వస్తున్న మెజారిటీ భారీగా ఏమీ లేకపోవడంతో, తదుపరి రౌండ్లలో తాము పుంజుకుంటామన్న విశ్వాసాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంతలోనే తెరాస ఆభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డికి 4062 ఓట్లు పోల‌వ‌గా, బీజేపీకి 3709 ఓట్లు పోల‌య్యాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 530 ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డించారు. ఆరో రౌండ్ ముగిసేస‌రికి బీజేపీకి 2,667 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు